ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి

  • రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి
  • సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ
  • టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేటి రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు పర్యటనలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్, టీవీ డిబేట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతిపై తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఒకప్పుడు రాజకీయాలు పాలసీ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవని, ఇప్పుడు కేవలం వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయని చెప్పారు.


సమాజంలో మిగిలిన ప్రొఫెషన్స్‌తో పోలిస్తే రాజకీయాల్లో విలువలు దారుణంగా పడిపోతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. "డాక్టర్లు, న్యాయవాదులు వంటి వృత్తుల్లో ఉన్నవారు కోర్టుల్లోనో, బయటో ఎంత వాదించుకున్నా ఒకరినొకరు వ్యక్తిగతంగా గౌరవించుకుంటారు. అవసరమైనప్పుడు పరస్పరం మద్దతు ఇచ్చుకుంటారు. కానీ, రాజకీయాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. సిద్ధాంతాలు పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం ఎక్కువవుతోంది" అని విమర్శించారు.


ప్రస్తుత మీడియా కల్చర్‌పై కూడా మాజీ సీఎం గట్టిగానే కౌంటర్ వేశారు. "ఇప్పుడు వస్తున్న టీవీ డిబేట్లను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూసే పరిస్థితి అస్సలు లేదు. ఆ చర్చల్లో వాడే భాష, అరచుకునే విధానం చూస్తే.. అసలు టీవీనే ఆఫ్ చేసేయాలనే అంతటి విరక్తి కలుగుతోంది" అని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్య పదజాలం, ట్రోలింగ్ సంస్కృతి ఏమాత్రం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.


రాజకీయాలు అంటే ప్రజలకు సంబంధించినవని, అక్కడ వ్యక్తిగత అజెండాలకు తావుండకూడదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న గ్రౌండ్ లెవెల్ సమస్యలపై అసెంబ్లీల్లో, బయట చర్చలు జరగాలే తప్ప.. వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాల స్థాయిని దిగజార్చవద్దని లీడర్లకు సూచించారు. నాయకుల మధ్య పరస్పర గౌరవం లేకపోవడం వల్లే పబ్లిక్‌లో రాజకీయ విలువల గ్రాఫ్ క్షీణిస్తోందని హెచ్చరించారు.


Kiran Kumar Reddy
Former CM Andhra Pradesh
Political values decline
TV debates and social media trolling
Tirupati district news
United Andhra Pradesh politics

More Telugu News